జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
జర్నలిస్టుల సమస్యలు
వెంటనే పరిష్కరించాలి
- టిడబ్ల్యూ జెఎఫ్ ఆధ్వర్యంలో నిరసన
చురకలు ప్రతినిధి, హనుమకొండ ఫిబ్రవరి 24 :
గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ న్యూస్ ఫెడరేషన్ (టి డబ్ల్యూ జె ఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టి హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టి డబ్ల్యూ జిల్లా నాయకులు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యలు గత ప్రభుత్వంతోపాటు ప్రస్తుత ప్రభుత్వం కూడా పరిష్కరించడం లేదని ఇప్పటికైనా మా ప్రధాన డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ప్రధాన సమస్యల్లో ముఖ్యంగా ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సర్కారు రివ్యూ పిటిషన్ వేసి వాదనలు చేయాలని జర్నలిస్టులకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలని లేకపోతే కొత్త విధానం ద్వారా నైనా స్థలాలు కేటాయించాలని కోరారు. కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అమలు చేయాలని ప్రభుత్వమే భరించాలని అన్ని ప్రభుత్వ కార్పోరేట్ ఆసుపత్రిలో అమలయ్యే విధంగా చొరవ చూపాలని కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వడంలో మీడియా అకాడమీ విఫలమైందని ఇప్పటికే రెండుసార్లు వాయిదా ఇప్పటికైనా వెంటనే కొత్త అక్రిడేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా రిటైర్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేయాలని రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఉద్యోగుల రక్షణ మాదిరిగా ప్రత్యేక చట్టం తేవాలని మహిళా జర్నలిస్టులకు పనిచేసే కార్యాలయం నుండి ఇంటి వరకు యాజమాన్యాల భద్రత వహించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీ డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్, హనుమకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టీవీ రాజు గౌడ్, పి గోపాల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఐలయ్య, దామెర రాజేందర్ ,డెస్క్ జర్నలిస్టుల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు సిహెచ్ సోమ నరసయ్య, కే అశోక్, ఎల్ రఘుపతి, కార్యవర్గ సభ్యులు మండ రాజేష్, ఇసంపల్లి రమేష్, సుమన్, రాజేందర్, సంపత్ రెడ్డి, ప్రపల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.