చిన్న హనుమాన్ జయంతికి పటిష్ట భద్రత జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
చిన్న హనుమాన్ జయంతికి పటిష్ట భద్రత.
ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.
సీసీ కెమెరాలు ద్వారా నిరంతర పర్యవేక్షణ.
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఏప్రిల్ 10: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు లో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 900 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. బందోబస్తును 6 సెక్టార్స్ గా విభజించి 3 షిప్టుల పద్దతిన విధులు కేటాయించడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా హనుమాన్ జయంతి బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులు సిబ్బందిని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఏలాంటి నేరాలకు తావులేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించాలని సూచించారు. ఏదైనా సమస్య ఎదురైతే జిల్లా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు పోలీస్ సిబ్బంది ఓపికతో సలహాలు,సూచనలు ఇస్తూ భక్తుల మన్ననలు పొందేలా విధులు నిర్వర్తించాలని, ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా అందరూ సమన్వయంతో విధులు నిర్వహిస్తూ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ముఖ్యంగా దేవస్థానం,మాల విరమణ వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండి భక్తులు క్యూ లైన్ పాటించేలా చూడాలని,భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా 24 గంటలు పోలీస్ నిఘా ఉంచాలని ప్రతి ఒక్క భక్తుడు ప్రశాంతమైన వాతావరణంలో ఆంజనేయ స్వామిని దర్శించుకుని క్షేమంగా తిరిగి వెళ్లేవిధంగా ప్రతి పోలీస్ బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు.
పార్కింగ్ ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు.. ఈ సంవత్సరం భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున భారీ సంఖ్యలో వచ్చే వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసేలా చూడాలని,ట్రాఫిక్ ,పార్కింగ్ ప్రదేశాల్లో విధుల్లో ఉన్న సిబ్బంది ట్రాఫిక్ జామ్ అవకుండా నియంత్రణ చేయాలన్నారు. రాత్రి వేళలో ప్రమాదాలు జరగకుండా స్టాపర్స్, కోన్స్, స్టిక్కర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేయవలసిన భద్రత ఏర్పాటలను పరిశీలించి అదికారులకు పలు సూచనలు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా కాలి నడకన వచ్చే భక్తులు రోడ్డుపైన వెళ్ళే వాహనాలు గమనిస్తూ నడవాలి. హనుమాన్ దీక్ష తీసుకున్న దీక్షపరులు కాలినడకన కొండగట్టుకు వచ్చే సమయం లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రేడియం స్టికర్స్ ను వారి బ్యాగులకు, జెండా కు అంటించడం జరిగింది. రోడ్డు కు ఇరువైపులా నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని వాహనాలను గమనిస్తూ తమ యొక్క గమ్యస్థానానికి చేరుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి లు రఘు చందర్, రాములు, రంగారెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ అరిఫ్ అలీ ఖాన్, సిఐలు రవి ,రామ్ నరసింహారెడ్డి, సురేష్ ,అనిల్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, వేణు, వివిధ జిల్లాలకు చెందిన సిఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.